నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యాకోబు 4:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును...'' ప్రకారం ప్రభువు మీ యెడల కృప చూపించాలని మీ పట్ల ఎంతగానో కోరుకొనుచున్నాడు. ఇంకను మనము ఆయన యొద్దకు రావాలి అని ప్రభువు ఆశించుచున్నాడు. బైబిల్‌లో ద్వితీయోపదేశకాండము 4:7వ వచనములో మనము చూచినట్లయితే, "ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?'' ప్రకారం ప్రభువు ఇశ్రాయేలీయులకు ఎంతో సమీపముగా ఉన్నాడు. వారు ఎప్పుడు ప్రార్థించిన, వారు ప్రభువు వైపు చూచినప్పుడు కూడా వారికి ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇంకను వారికి దగ్గరగా వచ్చాడు. బైబిల్‌లో లూకా 13:34వ వచనమును చూచినట్లయితే, "యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి'' అని యేసు ప్రభువు అంటున్నాడు. అవును, ప్రభువు మనలను తన యొక్క చేర్చుకోవాలని ఆయన ఎంతో మన పట్ల వాంఛకలిగియున్నాడు.

నా ప్రియులారా, అనేకసార్లు ప్రభువు తన బిడ్డలైన ఇశ్రాయేలీయులను తన దగ్గరకు చేర్చుకోవాలని ఎంతగానో ఆశించాడు. కానీ, వారు ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడలేదు. ఆలాగుననే, ఒకసారి యేసు ప్రభువు, ప్రార్థించుచున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతటి వైపు చూస్తూ, విలపించుచుండెను. పైన వచనములో చెప్పబడిన మాటలను ఆయన పలికిన మాటలు అవి. ఆ విధంగానే, మీరు కూడా ఆయన యొద్దకు రావాలని ప్రభువు ఎంతగానో ఆశించుచున్నాడు. దయచేసి, మీరు ఆయన స్వరమును వినండి. దయచేసి ఆయన యొద్దకు రండి. అందుకే యేసు ప్రభువు, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని సెలవిచ్చుచున్నాడు. నా స్నేహితులారా, ఈ రోజు కూడా ప్రభువు తన యొద్దకు రమ్మని మిమ్మును పిలుచుచున్నాడు. ఈ సందేశమును చదువుచున్న మీరు ఆయన పిలుపును విని, ఆయన దగ్గరకు వస్తారా? దేవుడు తన యొద్దకు రమ్మని మిమ్మును పిలుచుచున్నాడు. మీరు ఆయన యొద్దకు రండి, యేసుకు దగ్గరగా రండి, ఈ లోకములో ఏ మనుష్యుడు మీకు సహాయము చేయజాలడు. ఆయన మాత్రమే మీకు సహాయము చేసి, మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటాడు.

నా ప్రియులారా, మనము ఎంతో స్వార్థపూరితమైన లోకములో జీవించుచున్నాము. ప్రజలు స్వార్థపూరితంగా ఇంకా ఎంతో అధికముగా సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు. అయితే, మీరు అడుగువాటన్నిటికంటె, ఎంతో ధారాళముగా ఇచ్చుటకు యేసు ప్రభువు ఎంతో ధారాళత్వమును కలిగిన ప్రభువుగా ఉన్నాడు. కనుకనే, ఉన్న పక్షముననే యేసు యొద్దకు రండి, మీ భారమంతయు ఆయన పాదముల చెంత మోపండి, యేసు మిమ్మును పిలుచుచున్నాడు. ప్రభువు యొద్దకు మనము వచ్చినప్పుడు, ఏమి జరుగుతుంది? బైబిల్‌లో చూచినట్లయితే, హెబ్రీయులకు 7:25వ వచనములో ఉన్న రీతిగా, "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు'' ప్రకారం, ఆయన యొద్దకు వచ్చువారందరిని ఆయన సంపూర్ణముగా రక్షించగల దేవుడై యున్నాడు. ఆయన యొద్దకు వచ్చువారందరిని ఆయన రక్షించుట మాత్రమే కాదు, వారి పక్షమున ఆయన విజ్ఞాపనము చేస్తాడు. కనుకనే మీరు భయపడకండి.

ఆలాగుననే, ప్రార్థన గోపురమునకు వచ్చిన ఒక వ్యక్తి యొక్క సాక్ష్యమును ఇక్కడ మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. ప్రియ సహోదరులు అరుణ్ వెంకటేశ్వర్లు, అతడు పొల్లాచి నగరములో నివసించుచున్నాడు. అతనికి ప్రభువును గురించి ఎప్పుడు తెలియదు. అతని భార్యకు కూడా దేవుని గురించి ఏమి తెలియదు. 10 సంవత్సరములు ఆలాగున గడిచిపోయాయి, అతనికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అయితే, అతడు ప్రతిరోజు కూడా మద్యమును సేవించేవాడు. అంతమాత్రమే కాదు, అతడు ఒక మద్యము దుకాణములో పనిచేసేవాడు. అందును బట్టి అతని భార్య ఎంతగానో చింతించినది. చివరిగా వారిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. కానీ, అతని యొక్క స్నేహితులలో ఉన్న ఒక స్నేహితుని తండ్రి, అతనికి యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును గురించి చెప్పాడు. ప్రార్థన గోపురమునకు ఫోన్ చేసి, ప్రార్థన యోధులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి, ప్రార్థించమని అతను చెప్పాడు. ప్రతిరోజు అతడు ప్రార్థన గోపురమునకు కాల్ చేసేవాడు. ఒకరోజు తన స్నేహితుని యొక్క తండ్రి బేతెస్ద ప్రార్థన గోపురమునకు అతనిని తీసుకొని వెళ్లాడు. అక్కడ 40 దినములు అతడు ప్రార్థించాడు. 20వ రోజున అతడు తనకున్న ఆ దురలవాటు, అనగా ఆ మద్యమును సేవించే అలవాటును అతడు విడిచిపెట్టి, తన స్వంత వ్యాపారమును ప్రారంభించాడు. అతడు ఒక ఆటోను కొనుక్కొని దానిని నడపడము ప్రారంభించాడు. 40 వ దినమున అతని భార్య తన యొద్దకు పరుగెత్తుకొని తిరిగి వచ్చినది. మరొకసారి వారి యొక్క కుటుంబ జీవితాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ రోజు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని వారు కలిగియున్నారు. వారు యేసు నొద్దకు వచ్చిన రీతిగా, యేసయ్య వారి దగ్గరగా వచ్చాడు. యేసయ్య, వారికి ఒక గృహమును నిర్మించుటకు కృపను ఇచ్చాడు. నా ప్రియులారా, అదే దేవుడు మీకు ఎందుకు చేయడు? నేడు మనము ప్రభువు వైపు చూస్తూ ప్రార్థించుటకు ఆయన యొద్దకు రండి, ఆయన మీకు సమీపముగా ఉంటాడు, నేటి వాగ్దానము ద్వారా ఆయన మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని నీ దగ్గరకు చేర్చుకోవడానికి నీవు ఎంతో ప్రేమకలిగియున్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, మమ్మును నీకు సమీపముగా చేర్చుకొనుట కొరకే, మా కొరకు సిలువలో నీ ప్రాణమును పెట్టినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసయ్యా, మా భారమును నీ మీద మోపుచున్నాము మాకు విశ్రాంతిని దయచేయుము. దేవా, నీవు మా దగ్గర ఉండాలనే కోరికతో, మమ్మును నీ దగ్గరికి రమ్మని పిలిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, స్వార్థం మరియు మోసపూరితముతో నిండిన ఈ లోకములో, నీవు మాత్రమే నమ్మదగిన దేవుడవుగాను మరియు ధారాళంగా ఇచ్చే దేవుడవని మేము నీ యొద్దకు వస్తున్నాము. ప్రభువా. మా పూర్ణ హృదయంతో మేము నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చుచున్నాము, మా భారాలను, మా భయాలను మరియు మా అవసరాలను నీ వైపు చూస్తూ, నీ మీద మోపుచున్నాము. ప్రభువా, మమ్మును నీ దగ్గరికి చేర్చుకుంటూ, మరియు నీ కౌగిలింతను మేము అనుభవించునట్లుగా చేయుము. దేవా, నీ శాంతి, నీ ప్రేమ మరియు నీ విశ్రాంతితో మమ్మును నింపుము. ప్రభువా, ఈ రోజు, మేము నీ పిలుపును ఆలకించి, విని నీకు జవాబు ఇవ్వడానికి, నీ వైపు నడవడానికి మరియు ఎన్నటికిని వెనుకకు తిరగకుండా ఉండటానికి మమ్మును నడిపించుము. దేవా, మాలో ఉన్న చెడు అలవాట్లను తొలగించి, నీ మహిమ నిమిత్తము మేము వాడబడునట్లుగా నీకృపను మాకు దయచేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.