నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 81:16వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఈ వచనము ప్రకారం దేవుడు మిమ్మును నేడు దీవించును గాక. ఆ వచనము, "అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును'' అని ప్రభువు సెలవిచ్చిన ప్రకారం ప్రియులారా, దేవుడు ఎంతగా మనలను ప్రేమించే ప్రేమగల దేవునిని మనము కలిగియున్నాము కదా! అదేవిధముగా, మనము ఆదికాండము 27:28 వ వచనములో చూచినట్లయితే, "ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకనుగ్రహించు గాక'' అని చెప్పబడిన ప్రకారం ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినప్పుడు ఆకాశపు ఆశీర్వాదములతో అతనిని దేవుడు దీవించాడు. భూసారమును మరియు విస్తారమైన ధాన్యముతో అతనిని ఆశీర్వదించాడు. మన పరలోకపు తండ్రి యొక్క హృదయము కూడా అదేవిధముగా ఉన్నది.

బైబిల్‌లో యోహాను సువార్త 21వ అధ్యాయమును మనము చదివినట్లయితే, పేతురు మరియు మరి కొందరు శిష్యులు చేపలు పట్టడానికి వెళ్లియున్నారు. రాత్రంతయు వారెంతగానో ప్రయత్నించినప్పటికిని, రాత్రంతయు కూడా వారు చేపలు పట్టలేకపోయారు. తెల్లవారుచుండగా, యేసయ్య తీరము వద్ద వారికి ప్రత్యక్షమాయెను. ఆయన వారిని చూచి, "పిల్లలారా, రొట్టెతో కూడా తినడానికి ఏమైన చేపలు మీ యొద్ద ఉన్నవా?'' అని ఆయన అడిగినప్పుడు, వారు లేదు అని జవాబిచ్చారు. అప్పుడాయన దోనె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. వారు ఆయనకు లోబడి ఆ విధంగా చేసినప్పుడు, వలలు విస్తారముగా చేపలతో నిండిపోయెను. ఇంచుమించు 153 చేపలను వారు పొందుకున్నారు, వారు దిగి దరికి రాగానే, అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలును, రొట్టెయు వారికి కనబడెను. యేసు, "పిల్లలారా, రండి భోజనము చేయుడని వారితో చెప్పెను.'' యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను. వారి యొద్ద అసలు చేపలు లేవు అని తెలిసినప్పటికిని కూడా, "పిల్లలారా, మీ యొద్ద చేపలు ఏమైన ఉన్నాయా? అని వారిని ప్రశ్నించాడు.'' ఎందుకు?

నా ప్రియులారా, ఎందుకంటే ఆయన హృదయం ఎల్లప్పుడూ మన పట్ల దయతో నిండి ఉంటుంది. మన జీవితములో అంతా ముగిసిపోయినప్పటికిని కూడా, యేసు ఇప్పటికే మీ కోసం ప్రత్యేకంగా ఏదో ఒక ఆశీర్వాదమును సిద్ధపరచుచున్నాడు. యేసు నొద్ద మనకు ఇవ్వడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అందుకే, ఆయన, "నా పిల్లలారా, మీరు ఏమైన ఆహారమును భుజించారా?'' అని ఈ రోజు కూడా యేసయ్య, మిమ్మును చూచి ప్రశ్నించుచున్నాడు. అవును, నా ప్రియులారా, అతి శ్రేష్టమైన ఆశీర్వాదమును ఇచ్చుట యందు ప్రభువు ఎంతగానో ఆసక్తిని చూపుచున్నాడు. కారణము, ఆయన మిమ్మును జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన మిమ్మును అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి మిమ్మును పోషిస్తాడు మరియు కొండ తేనెతో మిమ్మును తృప్తిపరచాలని మీ పట్ల కోరుకుంటున్నాడు (అత్యంత ఊహించని స్థలముల నుండి వచ్చే ఆశీర్వాదాలు). కాబట్టి, మీరు మీ జీవితమును దేవునికి సమర్పిస్తారా? అయితే, ప్రార్ధిద్దాము. మీరు ఆలాగున మీ జీవితాలను ఆయనకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మీకు మంచి ఆహారమునిచ్చి, మిమ్మును తృప్తిపరచి, ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా అతి శ్రేష్టమైన గోధుమలతో మమ్మును ఆశీర్వదించే దేవుడవు నీవే. కొండ తేనెతో మమ్మును తృప్తిపరచే ప్రభుడవు నీవే. దేవా, ఈ రోజు మేము వాక్యము ద్వారా చూచినట్లుగానే, నీ శిష్యుల పట్ల ఎంతగా ప్రేమ చూపించి, జాగ్రత్త వహించినట్లుగానే, నీవు మా పట్ల నీ కనికరమును చూపించుము. దేవా, మా యొక్క ఏమి లేని వలలను అతి శ్రేష్టమైన దీవెనలతో నింపుము. ప్రభువా, మా అప్పుల బాధ నుండి మమ్మును విడిపించుము. తండ్రి, మమ్మును జ్ఞాపకము చేసుకొని, మా జీవితములో ఉన్న ప్రతి సమస్య నుండి మమ్మును విడిపించుము. మాలో ఉన్న శూన్యతను తొలగించి, నీ యొక్క పరిపూర్ణతను పొందుకొనునట్లుగా కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము అడగకముందే మా అవసరతలు నీకు తెలుసు. దేవా, ఈ రోజు, మేము మా హృదయాన్ని, మా ప్రయత్నాలను మరియు మా జీవితాన్ని నీకు అప్పగించుచున్నాము. ప్రభువా, మమ్మును నడిపిస్తావనియు, మాకు సమస్తమును అందిస్తావనియు మరియు మమ్మును ఆశీర్వదిస్తావనియు మేము నమ్ముచున్నాము. దేవా, నీ పరిపూర్ణతలో నుండి ఒక ఆశీర్వాదము వెంబడి మరొక ఆశీర్వాదమును మేము పొందుకొనునట్లుగా సహాయము చేయుము. దేవా, అత్యంత శ్రేష్టమైన యీవులను మాకు అనుగ్రహించి మమ్మును తృప్తిపరచుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.